Smriti Irani: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దయినప్పుడు.. ఢిల్లీలో ఆయనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని పార్లమెంటు నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు స్మృతి ఇరానీ, బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ చేతిలో దారుణపరాజయం పొందారు. ఇప్పుడు ఆమె తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి రావడంతో కొంత మంది కాంగ్రెస్ సానుభూతిపరులు ఆమెపై ట్రోల్స్ చేశారు. ప్రజలు ఆమెకు బుద్ధి చెప్పారని కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారం రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. దీంతో ఆయన అలాంటి చర్యలను తిరస్కరించారు.
‘జీవితంలో గెలుపు, ఓటములు వస్తుంటాయి, పోతుంటాయి. స్మృతి ఇరానీపై అభ్యంతరకర భాష వాడొద్దు, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించవద్దు. ప్రతి ఒక్కరూ అలాంటి వాటికి దూరంగా ఉండాలి. స్మృతి ఇరానీ అయినా మరే నేత అయినా ఇలాంటి వెకిలి చేష్టలు కూడదు. ఒక మనిషిని అవమానించడం బలహీనతకు సంకేతం, బలానికి కాదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తాను ప్రస్తుతం విద్వేష రాజకీయాలకు ప్రత్యామ్నాయ రూపాన్ని ఏర్పాటు చేయదలిచానని పలుమార్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. సింగిల్ లైన్లో చెప్పాలంటే ‘నఫ్రత్కు బాజార్మే ముహబ్బత్కి దుకాణ్’ తెరిచానని బలమైన వ్యాఖ్యలు చేశారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని అమేథీలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. రాహుల్ గాంధీ అప్పుడు అమేథీ నుంచి ఓడినా కేరళలోని వయానాడ్ నుంచి గెలుపొందారు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ఆయన వయానాడ్తోపాటు రాయబరేలీ నుంచి పోటీ చేశారు. అంతకు క్రితం వరకు రాయబరేలీ నుంచి సోనియా గాంధీ ఎంపీగా ఉన్నారు. కానీ, అనారోగ్య సమస్యలతో ఆమె రాజ్యసభలో అడుగుపెట్టారు. ఈ సారి రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలుపొందడంతో వయానాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఇక అమేథీలో స్మృతి ఇరానీని కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ ఓడించారు. దీంతో యూపీలో సుదీర్ఘకాలంపాటు గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న రాయబరేలీ, అమేథీలను తిరిగి కైవసం చేసుకున్నట్టయింది.
రాహుల్ గాంధీని ఓడించిన తర్వాత స్మృతి ఇరానీ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా ఆమె ఓ బీజేపీ కార్యకర్త మొత్తం గాంధీ కుటుంబాన్ని సర్దుకునే వెళ్లేలా చేసిందని కామెంట్ చేశారు.