DK Shivakumar : కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. పార్టీ కోసం తాను ఎన్నోసార్లు త్యాగాలు చేశానన్నారు. సిద్ధరామయ్యకు అండగా నిలిచానని గుర్తు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 66 చోట్ల గెలిచింది. జేడీఎస్ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. స్పష్టమైన మెజార్టీ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్న విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తర్జనభర్జనలు పడుతోంది.
ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రెబల్స్ నేతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవి కోసం భూపేశ్ భగేల్, టీఎస్ సింగ్ మధ్య పోటీ ఏర్పడింది. ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉండేలా పార్టీ అధిష్టానం సయోధ్య కుదిర్చింది. తొలుత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన భూపేశ్.. రెండున్నరేళ్ల తర్వాత రాజీనామా చేసేందుకు నిరాకరించారు. అలాంటి పరిస్థితులు కర్ణాటకలో ఎదురుకాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది.
మరోవైపు ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లపాటు సీఎం పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గు చూపవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం కూడా ఛత్తీస్ గఢ్ మాదిరే పార్టీకి భవిష్యత్లో తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి.