Mahua Moitra : టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంటిని ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అధికారుల బృందం అక్కడకు వెళ్లింది. లోక్సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయక తప్పలేదు.
ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బంగ్లా ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DoE) విభాగ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు.అప్పటికే ఆమె బంగ్లాను ఖాళీ చేసి వెళ్లింది.
లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, పార్లమెంట్ లాగిన్ను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేపట్టింది.
మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటి పేర్కొంది. పార్లమెంట్ లాగిన్ వివరాలను నిబంధనలను వ్యతిరేకంగా బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు తేల్చింది. ఈ నివేదికను లోక్సభ ఆమోదించింది.దాంతో ఆమె లోక్సభ సభ్వత్వాన్ని రద్దు చేసి.. సభ నుంచి బహిష్కరించారు.