Khalistan : దేశంలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల నెట్ వర్క్ విస్తరిస్తోందా? వారి అజెండా ఏంటి? ఢిల్లీనే టార్గెట్ చేశారా? ఇప్పుడు ఇలాంటి అంశాలన్నీ కలవరపెడుతున్నాయి. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఖలిస్థాన్ పోస్టర్లు వెలిశాయి. సిక్ఫర్ జస్టిస్, ఖలిస్థానీ జిందాబాద్, రెఫరెండం -2020 లాంటి నినాదాలతో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 153 B, నేరపూరిత కుట్ర 120 B కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారో ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. పోస్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ ను పెంచారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు.
ఢిల్లీలో ఖలిస్థాన్ ఉగ్ర నెట్వర్క్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించాయి. ఈ విషయంపై ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెలువరించింది. ఇటీవల ఢిల్లీలో ఖలిస్థాన్కు మద్దతుగా గోడలపై రాతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వికాశ్పురి, జనక్పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హ, పశ్చిమ ఢిల్లీలోని ప్రాంతాల్లో ఇలాంటి రాతలు కనిపించడంతో.. పోలీసులు వెంటనే వీటిని తొలగించారు. ఢిల్లీలో ఈ ఉగ్రసంస్థ దాడులు నిర్వహించే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.
రిపబ్లిక్ డే వేడుకలకు ముందు సిక్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన గురుపత్వంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడు. గణతంత్ర దినోత్సవం వేళ ప్రత్యేక పంజాబ్ అనుకూల సంస్థ ఎస్ఎఫ్జే ఉగ్రదాడులకు పాల్పడుతుందని ఆ వీడియోలో హెచ్చరించాడు. జనవరి 26న ఇళ్లల్లోనే ఉండండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గురుపత్వంత్ సింగ్ హెచ్చరికలు పంపాడు. ఢిల్లీనే టార్గెట్ గా పేర్కొన్నాడు. అదే రోజు ఖలిస్థాన్ జెండాను ఆవిష్కరిస్తామని గురుపత్వంత్ సింగ్ వీడియోలో చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. ఇలా ఖలిస్థాన్ కార్యకలాపాలు ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాద నెట్ వర్క్ పై ఉక్కుపాదం మోపి అణచివేస్తోందా? ఆ దిశగా చర్యలు చేపట్టిందా..?