Bengaluru: ఆ రైతుకు కాయ కష్టమే తెలుసు కానీ, పట్టణ పోకడలు ఎరుగడు. తాను కష్టపడినా తన కొడుకు పట్టణంలో నౌకరీ చేస్తున్నాడనే సంతోషం తప్పితే పట్టణానికి తాను రావాలనే కోరిక ఎప్పుడూ లేదు. కానీ, కన్న తండ్రి పట్టణంలో ఉన్న కొడుకు వద్దకు వస్తే.. ఆ కుమారుడు తండ్రికి తన ప్రపంచం పరిచయం చేయాలని ఉవ్విళ్లూరాడు. మాల్లో సినిమా టికెట్లు బుక్ చేశాడు. తండ్రితోపాటు మాల్కు వెళ్లాడు. తన తండ్రి ధోతీ ధరించాడని, ధోతీ ధరించడం కొందరికి అభ్యంతరకరం అని కొడుకు ఎప్పుడూ అనుకోలేదు. మాల్లోకి ప్రవేశిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి వారిని అడ్డుకుంది. మాల్లోకి వారికి ప్రవేశం లేదని కరాఖండిగా చెప్పేసింది. ఇద్దరూ ఖంగుతిన్నారు. ఎందుకు అని కారణాన్ని విచారించగా.. తన తండ్రి ధోతీ కట్టుకున్నాడని, తమ మాల్ యాజమాన్య నిబంధనల ప్రకారం మాల్లోకి ధోతీ ధరించిన వారికి అనుమతి లేదని చెప్పడంతో రెట్టింపు షాక్కు గురయ్యారు. అసలు ఇలాంటి పాలసీ ఒకటి ఉంటుందా? అని బిత్తరపోయారు.
తాము ఇప్పటికే సినిమా కోసం టికెట్లు బుక్ చేసుకున్నామని, ధోతీ ధరిస్తే అనుమతించకపోవడమేమిటని కొడుకు ఆ సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించాడు. ఆ రైతు కూడా ప్రశ్నలు వేశాడు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది నిర్ణయంలో మాత్రం మార్పు లేదు. దీంతో వారు వెనుదిరగకతప్పలేదు.
బెంగళూరులోని జీటీ మాల్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మాగాడి మెయిన్ రోడ్డులోని మాల్కు రైతు ఫకరీప్ప, ఆయన కొడుకు నాగరాజ్ వచ్చాడు. కానీ, సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారు. ‘నేను నా కొడుకును చూడటానికి చాలా దూరం నుంచి వచ్చాను. నా కొడుకు మమ్మల్ని మాల్కు తీసుకువచ్చాడు. ధోతీ ధరించానని చెప్పి నన్ను లోనికి అనుమతించలేదు. సర్లే అని ఇంటికి వెళ్దామని నా కొడుకుకు చెప్పాను. కానీ, నా కొడుకు ఊరుకోలేదు. వారిని ప్రశ్నించాడు. అయినా నిష్ప్రయోజనమే అయింది. కానీ, ఇలాంటి ఘటన నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు’ అని రైతు నిట్టూర్చాడు.
Also Read: రేపు సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ధోతీ ధరించడం ఎప్పటి నుంచి నేరమైపోయిందని, ధోతీ మన సాంప్రదాయాల్లో భాగం కదా అని నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఆ మాల్కు బుద్ధి చెప్పాలని, సదరు రైతును, ధోతీ సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్లంతా ధోతీ ధరించి ఆ మాల్కు వెళ్లాలని మరొకరు సూచనలు చేశారు. కర్ణాటక సీఎం కూడా ధోతీ ధరిస్తారని, ఇక్కడ మాల్ ఇంత అభ్యంతరకర నిబంధనలు పెట్టుకోవడం ఏమిటీ? అని ఇంకొకరు నిలదీశారు.
A farmer with #Dhoti wasn't allowed in #GTMall at #Bengaluru
Its the cultural attire and shaan of india and is it fair that farmers or any normal person have to face such a situation?. pic.twitter.com/xNK3jNgBOw
— Madhu M (@MadhunaikBunty) July 17, 2024
సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో జీటీ మాల్ మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. సదరు పెద్ద మనిషికి ఆ మాల్ క్షమాపణలు చెప్పింది. ఫకీరప్పకు మాల్ సెక్యూరిటీ ఇంచార్జీ ప్రశాంత్ క్షమాపణలు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరించారు.