Air India: ఓ ఉన్నత ఉద్యోగి.. విమానంలో ఫుల్ గా తాగి బుద్ధి మరిచాడు. ఏమాత్రం ఇంగితం లేకుండా ప్రవర్తించాడు. సీట్లో కూర్చొని ఉన్న వృద్ధ మహిళపై మూత్రం పోశాడు. విషయం తెలిసిన విమాన సిబ్బంది స్పందించాల్సిన విధంగా స్పందించలేదు. ఆ మహిళకు వేరే దుస్తులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ తాగుబోతు ప్యాసింజర్ ను వదిలేశారు. కట్ చేస్తే.. నెల తర్వాత విషయం వెలుగు చూసింది. బాధిత వృద్ధురాలు ఎయిర్ ఇండియా ఛైర్మైన్ కు లేఖ రాయడం.. అది కాస్తా DGCA దృష్టికి వెళ్లడం.. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం.. నిందితుడి అరెస్ట్.. వరుసగా జరిగిపోయాయి. విషయం తెలిసి నిందితుడు శంకర్ మిశ్రాను ఉద్యోగంలోంచి తీసేసింది కంపెనీ. లేటెస్ట్ గా, ఈ కేసులో మరోమారు యాక్షన్ మొదలైంది.
ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఎయిర్ ఇండియాపై.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది. 30 లక్షల జరిమానా విధించింది. విమాన పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్కు 3 లక్షల పెనాల్టీ కట్టాలని ఆదేశించింది.
ఘటనలో ఎయిరిండియా సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆ సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్, క్యాబిన్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు ఇప్పటికే చేపట్టింది ఎయిరిండియా. నిందితుడు శంకర్ మిశ్రా.. నాలుగు నెలల పాటు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. తాజాగా, ఎయిరిండియాపైనే DGCA చర్యలు తీసుకోవడం మరింత ఆసక్తికరం.