Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
శబరిమలలో భక్తుల రద్దీతో ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కాలినడక వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇక అంతకంతకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో కొందరు స్వాములు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. మరోవైపు భక్తుల రద్దీతో కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శబరిమల సన్నిథానానికి వెళ్లే అటవీ మార్గం సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు పెంచింది. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు తరలిరావడంతో తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో.. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.