ఎముకలు కొరికే చలిలో.. దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో.. పొగమంచు నగరాన్ని కప్పేసింది. పొగమంచు కారణంగా రోడ్డు మార్గంతో పాటు.. వాయు మార్గంలోనూ ఇబ్బందులు తప్పట్లేదు. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలితీవ్రత పెరగడంతో.. ఢిల్లీలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. నగరంలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో.. రోడ్లపై ప్రయాణించేందుకు కూడా మార్గాలు కనిపించడం లేదు. కొన్నిప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోగా.. గాలి నాణ్యత కూడా క్షీణించింది.
పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 110 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఉత్తర రైల్వే వెల్లడించింది. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లోనూ చలి గజగజలాడిస్తోంది. పాటియాలా (పంజాబ్), లఖ్ నవూ, ప్రయాగ్ రాజ్ (యూపీ)లో 25 మీటర్ల మేరే రహదారి కనిపిస్తోంది. అమృత్ సర్ లో ముందున్న వాహనం కూడా కనిపించనంత మంచు కురుస్తోంది. మరికొద్దిరోజుల పాటు ఢిల్లీ సహా.. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో పొగమంచు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది.