Who is Next CM in Delhi: ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ పై తీహార్ జైలు నుంచి రిలీజ్ అయిన 48 గంటల్లోనే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన సంచలన ప్రకటన దేశ రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సీఎం పదవికి 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆప్ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వీరితో పాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు కూడా స్టన్ అయ్యాయి.
ఈ విషయంలో కేజ్రీవాల్ ఆలోచనను ఏ పార్టీ కూడా అంచనా వేయలేకపోయాయి. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో మోదీ, అమిత్ షాను మించిన నాయకుడిగా కేజ్రీవాల్కు పేరుంది. ఏదో పెద్ద స్కెచ్ వేసే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం తదుపరి సీఎం ఎవరనేది దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
కేజ్రీవాల్ సంచలన ప్రకటనతో ఆమ్ ఆద్మీ పార్టీలో తదుపరి సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. కొంతమంది నేతలు సీఎం పదవిని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తన భార్యకు కేజ్రీవాల్ అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మరికొంతమంది కేజ్రీవాల్ అలా చేసే ప్రసక్తే లేదని, కుటుంబ వారసత్వ పార్టీగా ఆప్ని మార్చే సాహసం కానీ ఆ ఆలోచన కేజ్రీవాల్కు లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ జైలులో ఉండటంతో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్లు మాత్రమే పార్టీలో కీలక నేతలుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో కేజ్రీవాల్ భార్య సునీతా అధికారం చేపట్టే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.
అలాగే, సీఎం పదవిని ఇతరులకు ఇస్తే పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని కొంతమంది నేతలు చెబుతుండగా..ఇతర నేతలకు పదవి ఇచ్చిన తర్వాత వారి నుంచి తిరిగి బాధ్యతలు తీసుకోవడం అంత సులువైన పని కాదని బీహార్, జార్ఖండ్ రాజకీయ ఉదంతాలతో అర్ధమవుతోందని అంటున్నారు.
Also Read: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ తదుపది సీఎం ఎవరనే విషయంపై ఆప్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందులో చాలామంది సీనియర్ నేతల పేర్లు వినపిస్తున్నాయి. సీఎం భార్య ప్రముఖంగా వినిపిస్తుండగా.. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో అతిషి, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ వంటి పేర్లు ప్రచారంలో కొనసాగుతున్నాయి. అలాగే దళిత నాయకుడికి తదుపరి సీఎం అవకాశం ఇవ్వవచ్చని కొంతమంది నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11తో ముగియనుంది. ఢిల్లీలో గత అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న జరిగాయి. ఈ ఎన్నికల్లో 70 మంది సభ్యులకు గానూ ఆప్ పార్టీ 62 సీట్లు గెలుపొందగా.. బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.