Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృస్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు శబ్ధం వచ్చింది. ఈ పేలుడు ధాటికి స్కూల్ గోడతో పాటు సమీపంలో ఉన్న దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే కొన్ని వాహనాల అద్దాలు సైతం ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోరెన్సిక్ బృందాలతోపాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు పేలుడుకు గల కారణాలపై నిఘా పెట్టారు.
ఉదయాన్నే ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతోందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందారు. మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రశాంత్ విహార్లోని సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో ఉదయం 7.47 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీస్ అధికారి అమిత్ గోయల్ వెల్లడించారు. ఈ పేలుడుకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టేందుకు నిపుణులను పిలిపించామని తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలతోపాటు పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు దర్యాప్తు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని చెప్పారు. అలాగే డ్రెయినేజీ పైపు లైన్ పరిశీలించామన్నారు.