Delhi: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. దేశ రాజధానిలో ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఎర్రకోట, ఇండియా గేట్ పరిసరాలు మూడు రంగుల జెండాలతో నిండిపోయాయి. ఈ సారి వేడుకల్లో పాల్గొనేందుకు 18వందల మందిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరికి ఇప్పటికే ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులకు ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కేంద్రం ఈ సారి కల్పిస్తోంది. ఇందులో ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచ్లు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50మంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు, 50మంది ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు పాల్గొననున్నారు.
ఇక కొత్త పార్లమెంట్ భవనంలో పాల్గొన్న 50మంది శ్రామికులు, 50 మంది చేనేత కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన తయారీలో పని చేస్తున్న 50మంది కార్మికులకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. వీరితో పాటూ 50మంది చొప్పున ప్రభుత్వ ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులకు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 75 జంటలు.. తమ, తమ సాంప్రదాయ దుస్తులలో ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొనున్నారు.
మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎప్పటికీ గుర్తుంచుకునే ఏర్పాట్లను కేంద్రం చేసింది. వేడుకల్లో పాల్గొనే అతిథులు సెల్ఫీలు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసింది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్ చౌక్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ ఘాట్, జామా మసీదు మెట్రో స్టేషన్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ సహా 12 ప్రదేశాలలో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటయ్యాయి.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఆగస్టు 15 నుంచి 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ పోటీని నిర్వహిస్తోంది. 12 ప్రదేశాల్లో.. ఒక్కో చోటి నుంచి 12మందిని ఈ పోటీలో ఎంపిక చేసిన పది వేల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.