Mahua Moitra: జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మపై ఎక్స్ వేదికగా తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్సీడబ్ల్యూసీ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 79 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 123 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
హత్రాస్ ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు రేఖా శర్మ వెళ్లారు. ఆ సమయంలో వర్షం పడటంతో అక్కడున్న వారు ఆమెకు గొడుగు పట్టారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను మొయిత్రా గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిని సుమోటాగా తీసుకుని మహువా మొయిత్రాను అరెస్ట్ చేయాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఆ తర్వాత కూడా మొయిత్రా ఏ మాత్రం తగ్గకుండా ఎన్సీడబ్ల్యూసీ పోస్టుకు ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని నడియా జిల్లాలో ఉన్నానని నా గొడుగు నేను పట్టుకోగలను అంటే రేఖా శర్మను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం గమనార్హం.
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో మొయిత్రా గత లోక్ సభలో బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణానగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె 50 వేల మెజారిటీతో గెలుపొందారు.