Arvind Kejriwal Arrest: బీజేపీ పై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇప్పించి, ఆయన్ను అరెస్టు చేయించాలని కుట్ర పన్నుతోందన్నారు. అందుకే సీబీఐ నోటీసులు సిద్దం చేస్తోందని వెల్లడించారు.
విపక్షాల ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసిన దగ్గరి నుంచి బీజేపీకి కంటిమీద కునుకు లేదని గోపాల్ రాయ్ అన్నారు. సీబీఐ ద్వారా నోటీసు ఇప్పించి, కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలని అధికార బీజేపీ ప్రణాళికలు రచిస్తుందన్నారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసు సిద్దం చేసినట్లు తెలిసిందన్నారు. ఈడీ నోటీసుల ద్వారా వాళ్ల పాచిక పారలేదన్నారు. ఇప్పుడు సీబీఐని దుర్వినియోగం చేసేందుకు బీజేపీ ప్లాన్ వేస్తుందన్నారు. దర్యాప్తు సంస్థలు ఆప్ నేతలతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి కానీ, అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయాయన్నారు.
బీజేపీ బెదిరింపులకు ఆఫ్ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగంగానే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. తమను ఎవ్వరూ ఆపలేరన్నారు. ఆఫ్-కాంగ్రెస్ పొత్తుతో బీజేపీ భయపడుతోందని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
Read More: వారణాసిలో పీఎం పర్యటన.. అర్థరాత్రి కొత్త రోడ్డును తనిఖీ చేసిన మోదీ..
రెండు పార్టీల మధ్య పొత్తు తుది దశకు చేరుకుందన్న వార్తలు మొదలుకాగానే.. ఈడీ నుంచి కేజ్రీవాల్ కు ఏడో నోటీసు వచ్చిందని గోపాల్ రాయ్ ఆరోపించారు. ఆఫ్ కాంగ్రెస్ మధ్య పొత్తు ఖాయమైతే.. కేజ్రీవాల్ అరెస్టు అవుతారని సందేశాలు వస్తున్నాయన్నారు. కావాలంటే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసుకోవచ్చు కానీ.. పొత్తు మాత్రం ఉంటుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకుంటే ఢిల్లీ వీధుల్లో ప్రజల సునామీ వస్తుందని సందీప్ పాథక్ వ్యాఖ్యలు చేశారు.