Delhi Mayor: ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ మేయర్ ఎన్నిక వేళ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మేయర్ పీఠం ఆప్ కు దక్కినా తర్వాత కూడా వివాదం సమసిపోలేదు. స్టాడింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సమయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రంతా ఢిల్లీ కౌన్సిల్ లో హైడ్రామా నడిచింది.
స్టాండింగ్ కమిటీకి ఆరుగురు సభ్యులను ఎన్నుకునే ప్రక్రియను మేయర్ షెల్లీ ఓబెరాయ్ నిర్వహిస్తుండగా కౌన్సిల్ లో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ఓటింగ్ సమయంలో కొంతమంది సభ్యులు ఫోన్లు తీసుకొచ్చారంటూ రెండు పార్టీల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం ఘర్షణకు దారితీసింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. వారు పరస్పరం వాటర్ బాటిళ్లు, యాపిల్స్ విసురుకున్నారు. ఈ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కొందరు ఘర్షణ పడుతుంటే.. ఇంకొందరు వీడియోలు తీశారు. దీంతో ఢిల్లీ కౌన్సిల్ ఎనిమిదిసార్లు వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. శుక్రవారం తిరిగి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
ఢిల్లీ కౌన్సిల్ లో నెలకొన్న పరిస్థితులపై కొత్త మేయర్ షెల్లీ ఓబెరాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహిస్తుంటే బీజేపీ కౌన్సెలర్లు తనపై దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. ఈ ఘటన కాషాయ పార్టీ గుండాగిరికి నిదర్శనమని ట్వీట్ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. కాషాయ పార్టీ సభ్యుల ప్రవర్తన దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. గత రెండు నెలలుగా మేయర్ ఎన్నిక విషయంలో ఆప్ – బీజేపీ మధ్య పోరు నడిచింది. దీంతో అనేకసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎట్టకేలకు మేయర్ ఎన్నిక జరిగింది. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై వివాదం మొదలైంది. మరి ఈ విదానానికి ఎప్పుడు తెరపడుతోందో?