Delhi : ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులు మొదట ప్రమాణస్వీకారం చేయడంపై వివాదం రేగింది. మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు సభ్యులు నేలపై పడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మేయర్ ఎన్నిక కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బీజేపీకి చెందిన సభ్యుడిని ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈ నిర్ణయం ఆప్-బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఢిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సక్సేనా అనేక నియామకాలు చేపట్టారని ఆప్ ఆరోపణ. మేయర్ ఎన్నికను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. బీజేపీకి అనుకూలంగా ఉన్న సభ్యులనే ఉద్దేశపూర్వకంగా నామినేట్ చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. నామినేటెడ్ పదవులకు పేర్లు ప్రకటించిన తర్వాత సక్సేనా.. బీజేపీ సభ్యుడు సత్యశర్మను ప్రిసైడింగ్ స్పీకర్గా నియమించారు. ఆప్ ప్రతిపాదించిన సీనియర్ సభ్యుడు ముకేశ్ గోయల్ను పక్కనపెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించిన తీరును ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ తప్పు పట్టారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
వివాదానికి ఆప్ కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇరువర్గాలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభ వాయిదా పడింది. ప్రస్తుతానికి మేయర్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం భేరి మోగించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడింది. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. ఆప్ తరఫున షెల్లీ ఒబెరాయ్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. మెజార్టీ లేకున్నా బీజేపీ కూడా రంగంలో దిగడంతో పొలిటికల్ వార్ మొదలైంది.