Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వయంగా ప్రకటించింది. దీంతో.. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారన్న పుకార్లకు ఈడీ చెక్ పెట్టింది.
నిన్న రాత్రి నుంచి కేజ్రీవాల్ను లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ 3 సార్లు విచారణకు హాజరుకావలని ఈడీ ఆదేశించినా.. కేజ్రీవాల్ హాజరుకాలేదు. విచారణకు ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానని చెబుతూనే.. ఈడీ నోటీసులు రాజ్యాంగ విరుద్ధమని కేజ్రీవాల్ బుధవారం ఓ లేఖ కూడా రాశారు. అందుకే తాను విచారణకు హాజరుకాలేనని తేల్చి చెప్పారు. కేజ్రీవాల్ లేఖతో ఒక్కసారిగా ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అప్పటి నుంచి ఆయన్ని అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది.
ఆప్ అధినేతను అరెస్ట్ చేస్తారని తమకు సమాచారం ఉందని ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. దీంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈడీ అధికారులు వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఈడీ ప్రకటించింది. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని చెప్పింది.