Fist Extracts in Patanjali product: రాందేవ్ బాబాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కంపెనీ పతంజలిపై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ పడింది. దీంతో మరోసారి ఆయన కంపెనీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తున్నది. యోగా గురువు ప్రచారం చేస్తున్నట్టుగా పతంజలి ఆయుర్వేద్ ఉత్పత్తి చేస్తున్న టూత్ పౌడర్ ‘దివ్య మంజన్’ సంపూర్ణ శాకాహార ఉత్పత్తి కాదని ఓ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. వాళ్లు మార్కెట్ చేస్తున్నట్టుగా అది వెజిటేరియన్ ప్రాడక్ట్ కాదని ఆరోపించాడు. అందులో ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఉన్నదని పేర్కొన్నాడు.
దివ్య మంజన్ పూర్తి వెజిటేరియన్ ప్రాడక్ట్ అని ప్రచారం చేయడం వల్ల తాను సుదీర్ఘ కాలంగా ఈ పళ్ల పొడిని వాడుతున్నట్టు పిటిషనర్ వాదించారు. కానీ, ఇటీవలి పరిశోధనల్లో ఇందుకు భిన్నమైన సత్యం బయటపడిందని వివరించారు. ఆ పళ్ల పొడిలో సముద్రఫేన్ (సేపియా అఫిసినలిస్) ఉన్నదని, ఇది చేప నుంచి వచ్చే అవశేషం అని తెలిపారు.
పతంజలి ప్రాడక్ట్ దివ్య మంజన్ ప్యాకేజ్ పై గ్రీన్ డాట్ ఉన్నదని, అది వెజిటేరియన్ ప్రాడక్ట్ అని ఈ హరిత చుక్క సూచిస్తుందని పిటిషనర్ వివరించారు. కానీ, అదే ప్యాక్ పై ఇంగ్రిడెంట్స్ జాబితాలో స్పష్టంగా సేపియా అఫిసినలిస్ ఉన్నట్టు పేర్కొన్నారని తెలిపారు.
ఇది వెజిటేరియన్ ప్రాడక్ట్ కాదని వారికి తెలుసు అని, కానీ, ఉద్దేశపూర్వకంగానే దీన్ని వెజిటేరియన్ ప్రాడక్ట్గా మార్కెటింగ్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఇది డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ను ఉల్లంఘిస్తుందని స్పష్టం చేశారు. ఇది తనకు, తన కుటుంబానికి తీవ్రమైన వేధనను కలిగిస్తున్నదని, ఎందుకంటే తమ విశ్వాసాల ప్రకారం తాము మాంసాహార పదార్థాలను తినమని పేర్కొన్నారు. రాందేవ్ బాబా స్వయంగా ఓ యూట్యూబ్ వీడియోలో ఈ విషయాన్ని అంగీకరించారని తెలిపారు. సముద్రఫేన్ అనేది జంతువుల నుంచి వస్తుందని, దాన్ని దివ్య మంజన్లో వినియోగించామని రాందేవ్ బాబా స్వయంగా తెలిపారని పిటిషన్ వివరించారు.
Also Read: TPCC Chief: ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
తాను ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు, కేంద్ర వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఆయుష్ మంత్రిత్వ శాఖల వద్దకూ తాను తీసుకెళ్లానని, కానీ, తన ఫిర్యాదును ఈ ప్రభుత్వ ఏజెన్సీలేవీ స్వీకరించలేదని సంచలన ఆరోపణ చేశాడు. తన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు.
ఇలా ప్రాడక్ట్కు తప్పుడు లేబులింగ్ వేయడాన్ని న్యాయస్థానం కలుగజేసుకుని బాధ్యులైన వారిని తేల్చాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇలా తమను పక్కదారి పట్టించి నాన్ వెజ్ ప్రాడక్ట్ను తినిపించి తమ కుటుంబానికి క్షోభను కలిగించినందుకు తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేశాడు. ఈ పిటిషన్ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు పతంజలి ఆయుర్వేద, బాబా రాందేవ్, కేంద్ర ప్రభుత్వం, పతంజలి దివ్య ఫార్మసీలకు నోటీసులు పంపింది. తదుపరి విచారణ నవంబర్ 28వ తేదీన జరగనుంది.
ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో వారి ఆయుర్వేద ఉత్పత్తులను ప్రచారం చేసినందుకు సుప్రీంకోర్టు పతంజలి వ్యవస్థాపకులైన రాందేవ్ బాబా, ఆచార్య బాలక్రిష్ణలపై మండిపడింది. వారు రాతపూర్వకంగా క్షమాపణలు కోరిన తర్వాత.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకూడదని వార్నింగ్ ఇచ్చి కోర్టు వారిని విడిచిపెట్టింది.