Murder: ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.. ఓ యువకుడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిక్కీ యాదవ్ అనే మహిళను ఆమె ప్రియుడు సాహిల్ గహ్లోత్ హత్య చేసి మృతదేహాన్ని ఓ దాబాలో ఉన్న ఫ్రీజర్లో దాచాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిక్కీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరపగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిక్కీని కారులో ఛార్జింగ్ కేబుల్తో మర్డర్ చేసినట్లు సాహిల్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.
నిక్కీ ఢిల్లీ నజఫగర్లోని ఓ అపార్ట్మెంట్లో తన బంధువులతో కలిసి ఉంటూ.. కాలేజీకి వెళ్తోంది. ఈక్రమంలో సాహిల్ అనే యువకుడితో నిక్కీకి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అది ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈక్రమంలో సాహిల్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఈనెల 9న ఆ యువతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నిక్కీ సాహిల్ను నిలదీసింది. అతనితో గొడవకు దిగింది. అదే రోజున సాహిల్, నిక్కీ వాళ్ల ఫ్లాట్కు వచ్చి కారులో ఆమెను బయటకు తీసుకెళ్లాడు. కారులో కూడా నిక్కీ పెళ్లి ప్రస్తావన తేవడంతో కోపంతో రగిలిపోయిన సాహిల్.. ఛార్జింగ్ కేబుల్ను నిక్కీ మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కారులోనే ఉంచుకొని 40 కి.మీ ప్రయాణించి తన దాబాకు చేరకున్నాడు. అక్కడ ఫ్రీజర్లో మృతదేహాన్ని ఉంచి.. తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.
మరునాడు నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే నిక్కీ నాలుగురోజులుగా ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో దర్యాప్తు జరిగిన పోలీసులు దాబాలోని ఫ్రీజర్లో నిక్కీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిక్కీ ప్రేమవ్యవహారం తెలిసి..సాహిల్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయట పడింది.
సోస్టుమార్టం రిపోర్టులో కూడా నిక్కీ ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు సాహిల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.