Delhi Crimes : దేశరాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఒకే కుటుంబంలోని నలుగురు కత్తిపోట్లతో దారుణ హత్యకు గురయ్యారు. కన్న కొడుకే కాలయముడై తన తండ్రి, తల్లి, అమ్మమ్మ, సోదరిని పొట్టనపెట్టుకున్నాడు.
తల్లిదండ్రుల మృతదేహాలు బాత్రూంలో పడి ఉండగా, సోదరి, అమ్మమ్మ మృతదేహాలు వారి బెడ్రూమ్లలో పడి ఉన్నాయి. హంతకుడు కేశవ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.
25 ఏళ్ల కేశవ్ అనే యువకుడు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. మాదకద్రవ్యాలకు బానిస కావడం, గత దీపావళి నుంచి నిలకడైన సంపాదన లేకపోవడంతో ప్రతి రోజూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. కేశవ్ పదునైన ఆయుధంతో నలుగురు కుటుంబ సభ్యుల గొంతులు కోసి, పలుమార్లు కత్తితో పొడిచినట్టు పాలం పోలీసులు తెలిపారు. అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు గుర్తించారు. నిందితునిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు