Delhi Crime: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో మరచిపోలేం. 12 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ నిర్భయ ఘటన అనగానే.. కీచకులు చేసిన అరాచకం కళ్ల ముందు కదలాడుతుంది. ఆ విషయం గుర్తొచ్చిన ఎవరికైనా.. రక్తం మరిగిపోతుంది. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేసినా.. అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు తెలంగాణలో జరిగిన దిశ ఘటనలో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసినా.. మగాళ్ల రూపంలో ఉన్న మృగాళ్ల ఆలోచనల్లో ఏ కోశాన మార్పు రావట్లేదు. ఫలితంగా చిన్నారుల నుంచి.. పెద్దల వరకూ బలవుతున్నారు.
తాజాగా.. ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఒక వ్యక్తి, ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. జనవరి 1.. న్యూ ఇయర్ వేళ జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సహన్ బజార్ లో ఉన్న ఒక టీ స్టాల్ యజమాని నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఒక అమ్మాయిను సెట్ చేయాలని.. ఆ ప్రాంతంలో చెత్త ఏరుకునే ఒక మహిళను కోరాడు.
ఆమె అతని వద్ద కొంత డబ్బు తీసుకుని.. మరుసటి రోజున 12 ఏళ్ల బాలికను ఖుర్షీద్ మార్కెట్ లోని భవనం పై కప్పు నుంచి చెత్త సేకరించాలని చెప్పింది. దాంతో బాలిక అక్కడికి వెళ్లింది. అప్పటికే బాలిక కోసం ఎదురుచూస్తున్న నలుగురు.. ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన బాలిక.. మౌనంగా ఉండిపోయింది. రెండురోజుల తర్వాత బంధువులు, తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది. వెంటనే బాలికను తీసుకుని.. స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉన్న నిందితుల్లో ఒకడు టీ స్టాల్ యజమాని(ఛత్తీస్ గఢ్) కాగా.. మరో ముగ్గురు అందులో పనిచేసే యూపీ, మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్లని పోలీసులు తెలిపారు.