Delhi Air Pollution : సుమారు పది రోజులుగా తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతోన్న దేశ రాజధాని ఢిల్లీ వాసులకు గురువారం రాత్రి వరుణుడు కరుణించి ఊరటనిచ్చాడు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పెరిగిన వాయుకాలుష్యం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.
ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధం, వాహన ఉద్గారాలు వంటి కారణంగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రమైంది. ఈ క్రమంలో ఢిల్లీ మంత్రులు ఐఐటీ కాన్పూర్ బృందంతో సమావేశమయ్యారు. నగరంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి మేఘ మథనం ద్వారా ‘కృత్రిమ వర్షం’ కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. కృత్రిమ వర్ష ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి వస్తే.. వెంటనే అధ్యయనాన్ని నిర్వహిస్తాం’ అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు.
నగరంలో తీవ్ర వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు నవంబర్ 20-21 తేదీల్లో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించాలన్న ఢిల్లీ ప్రభుత్వ యోచిస్తోంది. ఈ సమయంలోనే హఠాత్తుగా వర్షం కురవడం పెద్ద ఊరట లభించింది. శుక్రవారం కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీలో వర్షం కురవడంతో కాలుష్య తీవ్రత కొంతమేర తగ్గింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదైంది. అంతేకాకుండా, కాలుష్యం నుండి గొప్ప ఉపశమనం లభించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయి 400 నుంచి 100కి పడిపోయింది.