4% DA Hiked: నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, బీహార్ ప్రభుత్వాలు ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముందుగా ఉద్యోగుల డీఏను పెంచుతున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ఛత్తీస్గఢ్లోని విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం కూడా డీఏ పెంచాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ఉద్యోగులకు ఇప్పుడు డీఏ 4 శాతం పెరగనుంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం (మార్చి 15) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను 4% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనిని 46%కి పెంచారు. పెంచిన డీఏను గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు చెల్లిస్తామని ఓ అధికారి తెలిపారు. జూలై 1, 2023 నుంచి ఫిబ్రవరి 29, 2024 వరకు డీఏ బకాయిలను ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది మార్చికి సంబంధించిన డీఏ వచ్చే నెలలో చెల్లిస్తారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 4% పెంచింది. ఇది పెన్షనర్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు, లక్ష మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఏడో పే స్కేల్కు సంబంధించిన బకాయిల చివరి విడత మొత్తం కూడా అందుతుంది.
Also Read: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?
హర్యానా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ చెల్లింపు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. హర్యానా ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచింది. ఇప్పుడు అది 46% నుంచి 50%కి పెరిగింది. డియర్నెస్ అలవెన్స్ జనవరి 1, 2024 నుంచి వర్తిస్తుంది. డిఏ మార్చి జీతంతో పాటు ఏప్రిల్లో చెల్లించనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏను 4 శాతం పెంచారు. డీఏ 46% నుంచి 50%కి పెరిగింది. బీహార్ ఉద్యోగులు, పెన్షనర్లు దీని నుంచి ప్రయోజనం పొందుతారు.