Cyclone Hamoon : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం (అక్టోబర్ 24) సాయంత్రం తుపానుగా, ఆ తర్వాత తీవ్రతుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు ఇరాన్ సూచించిన హమూన్ అనే పేరును పెట్టారు. హమూన్ సైక్లోన్.. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయానికి ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని ధిగాకు 360 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్ లోని హెపుపరాకు 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. మరో మూడు గంటల్లో అతితీవ్రతుపానుగా రూపాంతరం చెందనున్నట్లు వివరించింది.
రానున్న 12 గంటల్లో ఈ తుపాను వాయువ్య బంగాళాఖాతంలో మరింత బలపడి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్ లోని హెపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరదాటవచ్చని అంచనా వేసింది. 26వ తేదీ వరకూ తుపాను ప్రభావం బంగ్లాదేశ్ పై ఉంటుందని పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఒడిశాపై ఉండవచ్చని ఐఎండీ చెప్పింది. మంగళ, బుధవారాల్లో ఒడిశాలో మోస్తరు వర్షపాతంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు. పశ్చిమబెంగాల్ లోనూ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని తెలిపారు. ఈ తుపాను ప్రభావం.. ఒడిశాపై నేరుగా లేనప్పటికీ.. మత్స్యకారులెవరూ అక్టోబర్ 26 వరకూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.