Cyclone : బిపోర్ జాయ్ తుపాన్ గురువారం తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో గుజరాత్లో భారీ వర్షాలు కురవడంతోపాటు అతి బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాన్ బుధవారం గుజరాత్లోని కచ్, దక్షిణ పాకిస్థాన్ వైపు దిశను మార్చుకుంది. జఖౌ వద్ద తీరాన్ని దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ గమనం మందగించిందని ప్రకటించారు.
తుపాన్ సౌరాష్ట్ర, కచ్లను తాకుతుంది. అలాగే మాండవి, కరాచీల మధ్య జఖౌ సమీపంలో తీరాన్ని దాటనుంది. తుపాన్ స్వల్పంగా బలహీనపడిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అయినా సరే గుజరాత్కు ముప్పు పొంచే ఉందని హెచ్చరించారు. తుపాన్ తీరాన్ని దాటే సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సౌరాష్ట్ర, కచ్లలో కెరటాలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడతాయని పేర్కొన్నారు.
తుపాన్ ముప్పుతో గుజరాత్ తీర ప్రాంతాల్లోని సుమారు 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేవభూమి ద్వారక, జాంనగర్, జునాగఢ్, పోర్బందర్, రాజ్కోట్ జిల్లాల్లోని తొమ్మిది తాలూకాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో చర్చించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యలకు సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మహారాష్ట్రలో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు మోహరించారు. ముంబైలో 5 బృందాలను సిద్ధం చేశారు.
బిపోర్ జాయ్ తుపాన్ ప్రభావంతో గుజరాత్తోపాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతోపాటు దమణ్ దీవ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.