CRPF Jawan Died and 3 Injured in Search Operation in Manipur: మణిపూర్ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాల్లో ఆదివారం నిర్వహిస్తున్న జాయింట్ పెట్రోలింగ్ పై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడులు చేశారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందగా.. ఇద్దరు మణిపూర్ పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. అదేవిధంగా ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోర్ బంగ్ గ్రామంలో దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అక్కడ ఉగ్రవాదులు పెట్రోలింగ్ పార్టీపై కొండ ప్రాంతం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
సీఆర్పీఎఫ్ సైనికులు అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వారి వాహనంపై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది తిరిగి కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.
Also Read: 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీపై చర్చ అవసరమా ? : చిదంబరం
గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, భద్రతా బలగాలపై దాడి గత 5 వారాల్లో ఇది రెండవది. జూన్ 10న కాంగ్ పోక్పి జిల్లాలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. జిరిబామ్ జిల్లాలో జూన్ 6న రైతు సోయిబామ్ శరత్ కుమార్ సింగ్ హత్యతో సహా ఇటీవల అక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.