Crime: భర్తను హత్య చేసి ఐదు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టింది ఓ మహిళ. చుట్టుపక్కల వాళ్లకు ఎటువంటి అనుమానం రాకుండా మ్యానేజ్ చేసింది. అయితే దుర్వాసన రావడంతో గుట్టురట్టయింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఝార్ఖండ్లోని జంషెడ్పుర్లో చోటుచేసుకుంది.
వ్యాపారస్థుడు అమర్నాథ్ సింగ్ తన భార్య మీరాతో కలిసి సుభాష్ నగర్లో నివసిస్తున్నాడు. అయితే మీరా మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలవుతుండేవి. ఈక్రమంలో ఒకరోజు వారిద్దరి మధ్య వివాదం చోటుచేసుకొని అదికాస్త పెద్దదిగా మారింది. దీంతో కోపంతో రగిలిపోయిన మీరా తన భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టింది.
అయితే ఐదు రోజుల నుంచి అమర్నాథ్ సింగ్ కనిపించకుండా పోవడం.. అదే సమయంలో వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో అమర్నాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మీరాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.