Coronavirus : కరోనా బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రపంచం భయభ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. చైనాలో ఈ వేరియంట్ ఇప్పటికే ప్రతీ రోజు వేల ప్రాణాలను బలిగొంటుంది. భారత్లో ఈ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తే పరిస్థితేంటనేది ప్రముఖ ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్. నాగేశ్వర్రెడ్డి తెలిపారు.
చైనాలో తక్కువ నాణ్యత కలిగిన వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజల్లో ప్రస్తుతం కరోనా కేసులు కొత్త వేరియంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఇండియాలో అలాంటి పరిస్థితి రాదన్నారు. అయితే ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నా.. అక్టోబర్లో ఈ వేరియంట్ ఇండియాలోకి ప్రవేశించిందన్నారు.
ఇప్పుడు ఇండియాలో నమోదవుతోన్న కరోనా కేసుల్లో 80 శాతం ఎక్స్బీబీ రకానివేనని అన్నారు.ఒక్కరికి బీఎఫ్7 వైరస్ సోకితే.. అది పది మందికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. సెకండ్ వేవ్ పరిస్థితి భారత్లో మళ్లీ వచ్చే అవకాశం లేదన్నారు. బిఎఫ్7 వ్యాపించినా..అంత ప్రమాదకరం మాత్రం కాదన్నారు ఏఐజీ చైర్మన్ నాగేశ్ర్ రెడ్డి.