Corona Virus : భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,824 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు పెరగడం గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి. కరోనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,47,22,605 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 18,389కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
గత ఆరు నెలల్లో దేశంలో కరోనా మరణాలు పెద్దగా నమోదుకాలేదు. కానీ ఇటీవల అనేక రాష్ట్రాల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కోవిడ్ బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, హర్యానా, కేరళ, రాజస్థాన్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు. గతంలో చనిపోయిన ఒక వ్యక్తి మరణాన్ని కేరళ ప్రభుత్వం తాజా లెక్కల్లో చేర్చింది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 5,30,881 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల రోజువారీ పాజిటివిటీ రేట్ 2.87 శాతంగా ఉంది. వారం రోజుల పాజిటివిటీ రేట్ 2.24 శాతంగా నమోదైంది. కరోనా కేసుల రికవరీ రేట్ 98.77 శాతంగా ఉంది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా సాగింది. అందువల్లే మరణాలు సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇతర దేశాలకు భారత్ నుంచి వ్యాక్సిన్ ను సరఫరా చేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. తాజాగా కేసుల పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.