Rahul Gandhi : దేశంలో కరోనా కలవరం మళ్లీ మొదలైంది. కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో ఈ ఎఫెక్ట్ భారత్ జోడో యాత్రపై పడింది. రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. రాహుల్కు లేఖ రాశారు. కొవిడ్ నిబంధనలను పాటించలేకపోతే.. యాత్రను కొంతకాలం నిలిపివేయాలని సూచించారు.
భారత్ జోడో యాత్ర వల్ల రాజస్థాన్ లో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిసెంబర్ 20న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ కరోనా బారిన పడిన విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని కోరారు. మాస్క్లు, శానిటైజర్లు ఉపయోగించాలని, వ్యాక్సిన్ వేసుకున్నవారినే యాత్రకు అనుమతించాలన్నారు.
రాజస్థాన్ ఎంపీలు రాసిన లేఖపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందించారు. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ కు లేఖలు రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. లేకపోతే యాత్రను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. మరోవైపు బుధవారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర రాజస్థాన్ నుంచి హర్యానాకు చేరుకుంది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాహుల్ కు లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇటీవల గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాస్క్ పెట్టుకున్నారా? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని విమర్శించింది. కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తోన్న స్పందనను తట్టుకోలేకనే కాషాయ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని అధిర్ రంజన్ చౌదరీ మండిపడ్డారు.