Cops’ Spouse and Parents To Get Equal Compensation If They Die
డ్యూటీ చేస్తుండగానే ఓ పోలీస్ జవాన్ మృతి చెందాడు. అతనికి ఎక్స్ గ్రేషియా ప్రకటించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. అయితే పరిహారం విషయంలో వివాదం నెలకొంది. భర్త చనిపోగానే వారి కుటుంబాన్నివదిలి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న ఆ యువతి మొత్తం ఎక్స్ గ్రేషియా తనకే చెందాలని..తన అత్త మామలతో సంబంధం లేదని వాదించింది. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది. ప్రకటించిన ఎక్స్ గ్రేషియా ఇద్దరికీ సమానంగా వచ్చేలా నిబంధనలు అమలు చేసింది. అంతేకాదు ఇకపై ఎవరైనా పోలీసు జవాన్లు మరణిస్తే వారికీ ఇలాంటి నిబంధనలే వర్తిస్తాయని ప్రకటించింది. ఇంతకీ ఈ ప్రకటన చేసింది మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.
పరిహారం చెరిసమానం
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కాల్పులలో వీరమరణం పొందాడు. అతని మృతికి నివాళిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రూ.కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. అంతేకాదు ఆ పరిహారాన్ని భార్య, ఆమె అత్త మామలు సమానంగా పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ కుమారుడు మృతి చెందాక తమ కోడలు ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు తమ కుమారుడి అండ తప్ప వేరే ఆధారం లేదని ఆ వృద్ధ దంపతులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. వాళ్ల పరిస్థితిని సీఎం పెద్ద మనసుతో అర్థం చేసుకుని పరిహారం ఇద్దరూ సమానంగా పంచుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇలా వీరమరణం పొందిన సైనికులు, పోలీసులు ఎవరైనా వారి కుటుంబ సభ్యులకు ఇదే రూల్ వర్తిస్తుందని తెలిపారు.
సీఎంకు సర్వత్రా ప్రశంసలు
మధ్యప్రదేశ్ సీఎం తీసుకున్న నిర్ణయంతో అక్కడి రాష్ట్ర ప్రజలు అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో సీఎంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ నిర్ణయంతో మిగిలిన రాష్ట్రాలకు చెందిన సీఎంలు కూడా ఆ దిశగా ఆలోచనలు చెయ్యాలని అనుకుంటున్నారు. కేంద్రం కూడా వీరమరణం పొందిన వారి కుటుంబ సభ్యులకు అందించే పరిహారంలో మార్పులు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. చాలా మంది తమ భర్తలు మృతి చెందగానే వేరే వివాహం చేసుకోవడమూ లేక వృద్దులైన అత్త మామలను అనాథలుగా చేసి వెళ్లిపోవడమూ చేస్తుంటారు. పెళ్లి చేసుకోవడం తప్పుకానప్పటికీ పరిహారం విషయంలో మాత్రం సానుకూలంగా ఉండాలని సూచిస్తున్నారు.