Tamil Nadu: తమిళనాడులో ఆ రాష్ట్రం పేరుపై రేగిన వివాదం మరింత ముదురుతోంది. ఈ విషయంలో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వార్ నడుస్తోంది. రాష్ట్రానికి తమిళగం అనే పేరే కరెక్ట్ అని గవర్నర్ అంటున్నారు. తమిళనాడు పేరును మార్చే ప్రసక్తే లేదని స్టాలిన్ సర్కార్ స్పష్టం చేస్తోంది. తమిళగం అనే పేరును 1938లో పెరియార్ ఈవీ రామసామి తొలుత తెరపైకి తెచ్చారు. మద్రాస్ రాష్ట్రం పేరును మార్చే సమయంలో ఈ చర్చకు వచ్చింది. 1967 జులై 18న సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని డీఎంకెే ప్రభుత్వం మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చాలని తీర్మానం చేసింది. తమిళనాడు భారత్లో భాగమైన రాష్ట్రం. పేరు కారణంగా ఇది స్వతంత్ర దేశం కాదు అని ఆయన అప్పుడే స్పష్టం చేశారు.
తమిళనాడుకు ‘తమిళగం’ పేరు సరిగా సరిపోతుందని గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్రంలో అలజడి రేపింది. కొంత కాలంగా ‘తమిళగం’ అనే పేరు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పదం వాడకంపై తమిళనాడు నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. అసలు తమిళగం.. తమిళనాడు ఈ పదాలకు అర్థమేంటి? ఎందుకు ఆ రాష్ట్రం పేరుపై ఇప్పుడు వివాదం ఎందుకు రాజుకుంది. వివరాల్లోకి వెళితే…
తమిళంలో.. తమిళనాడు అంటే తమిళ భూమి అని అర్థం. తమిళగం అంటే తమిళుల నివాసం అని అర్థం. కానీ.. తమిళనాడు అనేది ఓ దేశాన్ని సూచిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు అంటే భారత్లో అంతర్భాగం కాదు.. దేశంలో భాగమైన ఓ స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని సూచిస్తున్నట్లు ఉందనే వాదనలు ఉన్నాయి. అయితే.. అధికార డీఎంకే ఈ విషయాన్ని ఖండిస్తోంది. ‘తమిళనాడు’ అనే పేరు.. తమ భాష, సంప్రదాయం, రాజకీయాలు, జీవితాన్ని సూచిస్తుందని పేర్కొంటోంది. ఈ నేల ఎప్పటికీ తమిళనాడుగానే ఉంటుందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.
డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ సైతం ఇటీవల గవర్నర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘తమిళనాడు అనేది ఒక సార్వభౌమ దేశాన్ని సూచిస్తుందని గవర్నర్ అన్నారు. రాజస్థాన్ పేరు మీకు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఉజ్బెకిస్థాన్లా అనిపిస్తోందా? మహారాష్ట్ర అనే పేరు ‘మరాఠాల భూమి’ అని సూచించడం లేదా? కేరళ పర్యాటక నినాదం.. దేవుడి సొంత దేశం అని ఉంటుంది. ఇది వివాదంగా కనిపించడం లేదా..? అని ప్రశ్నించింది.
మరోవైపు సోమవారం తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభనుద్దేశించి గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం పొందుపరిచిన అంశాలను విస్మరించడం వివాదం రాజేసింది. అందులో పేర్కొన్న పెరియార్, అన్నాదురై వంటి ద్రవిడ దిగ్గజాలను ప్రస్తావించలేదు.పైగా పలు అంశాలపై తన అభిప్రాయాలను జోడిస్తూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో రవి తీరుపై అధికార డీఎంకే సభ్యులు మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గవర్నర్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు సీఎం ఎంకే స్టాలిన్ సిద్ధమయ్యారు. కానీ స్టాలిన్ మాట్లాడుతుండగానే రవి హఠాత్తుగా లేచి సభ నుంచి నిష్క్రమించారు. డీఎంకే మద్దతుదారులు ట్విట్టర్లో గెటౌట్ రవి అంటూ ట్రోల్ చేశారు. గవర్నర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.