TTD Temple : నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ టెంపుల్ భూమిపూజ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
తిరుమల తరహాలో నవీ ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ముందుకు రావడంపై ఏక్నాథ్ షిండే సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆలయం నిర్మించనుండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ ఆలయం ద్వారా దర్శనభాగ్యం కలుగుతుందన్నారు.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండేళ్లలో తిరుమల ఆలయం తరహాలోనే ఇక్కడా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.ఈ ఆలయ నిర్మాణానికి రూ. 100 కోట్ల ఖర్చు అవుతుందని వెల్లడించారు.