Congress Leader Sajjan Singh: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో ధ్వంసమైన బంగ్లాదేశ్లాగా భారత ప్రజలు కూడా ఏదో ఓ రోజు ప్రధాని మోదీ అధికారిక నివాసాన్ని ముట్టడిస్తారని అన్నారు. సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సజ్జన్ సింగ్పై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ యువజన విభాగం డిమాండ్ చేస్తోంది. ఇండోర్లో జరిగిన ఓ సమావేశంలో సజ్జన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సమావేశంలో సజ్జన్ సింగ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో అల్లర్ల సమయంలో ప్రజలు ప్రధాని షేక్ హసీనా అధికారిక భవనంలోకి ప్రవేశించారని అన్నారు. ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. మోదీ గుర్తుంచుకోండి. మీ తప్పుడు విధానాల వల్ల కూడా ఏదో ఒక రోజు ప్రజలు మీ నివాసంలోకి ప్రవేశించి ఆక్రమించుకుంటారు. ఇదే ఇటీవల శ్రీలంకలో కూడా జరిగింది. శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి కూడా ఆందోళన కారులు ప్రవేశించారు.
Also Read: ఆ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగానే.. భగ్గమన్న విపక్షాలు.. సభలో గందరగోళం
తాజాగా బంగ్లాదేశ్లో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం భారత్ వంతు అని సజ్జన్ సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయుల మనో భావాలు దెబ్బతిసేలా సజ్జన్ సింగ్ మాట్లాడటంతో పాటు.. దేశ వ్యతిరేక పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు.