Congress Party Bank Accounts Frozen(Telugu breaking news today): దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు కాంగ్రెస్ నేత కోశాధికారి అజయ్ మాకెన్ వెల్లడించారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇదని అజయ్ మాకెన్ అన్నారు. రూ.210 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్యే అని, పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే చేశారని మాకెన్ ఆరోపించారు. గతంలో 2018-19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని, ఆ మాత్రం దానికే అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ఏంటని మాకెన్ ప్రశ్నించారు. ఈ విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయని మాకెన్ అన్నారు.
Read More: మద్యం ధరలు పెంపు.. బీర్స్పై ఎక్కువ ఎఫెక్ట్..
ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అజయ్ మాకెన్ అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ నాలుగు అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద లింక్ అయ్యి ఉన్నాయని తెలిపారు. అకౌంట్ల ఫ్రీజ్తో అన్నీ ఆగిపోతాయని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేం అని పేర్కొన్నారు. కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరామన్నారు. ఆఖరికి న్యాయ్ యాత్రపై కూడా ప్రభావం పడుతుందన్నారు.
ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారని ఆరోపించారు. కానీ తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించుకున్న నిధుల్ని అడ్డుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని తాను చెప్పిన విషయాన్ని ఖర్గే గుర్తచేశారు. దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని న్యాయవ్యవస్థను అభ్యర్థిస్తున్నానని మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. దీనిపై తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.