Congress support AAP on ordinance(Latest political news in India): ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సమర్ధించబోమని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఢిల్లీ హక్కులను హరించేలా కేంద్రం ఈ ఆర్డినెన్స్ జారీ చేసిందని అన్నారు. దీంతో.. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆప్ స్వాగతించింది. విపక్షాల సమావేశానికి ఒక్కరోజు ముందు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.
పాట్నా భేటీకి హాజరైన కేజ్రీవాల్.. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో విపక్షాల మద్దతు కోరారు. దేశవ్యాప్తంగా అప్పటికే పలువురి మద్దతు కూడగట్టిన ఢిల్లీ సీఎం.. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆర్డినెన్స్ వివాదంలో తమకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని.. లేదంటే.. విపక్ష కూటమితో తాము కూడా ముందుకు సాగలేమని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఆప్ కి మద్దతు పలికితే.. పంజాబ్, ఢిల్లీలో ప్రతిపక్ష స్థానం నైతికంగా వదులుకున్నట్టు ప్రజలకు సందేశం వెళ్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది.
పంజాబ్, ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో పలు దశలుగా అధిష్టానం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. చివరికి.. జాతీయ స్థాయిలో బలమైన కూటమి ఏర్పాటు చేయాలంటే.. ఓ మెట్టు దిగకతప్పదనే భావనకు ఏఐసీసీ నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. ఢిల్లీలోని కేంద్ర ఆర్డినెన్స్ విషయంలో కేజ్రీవాల్ సర్కార్ కు మద్దతు పలికింది. కాంగ్రెస్ నుంచి ఆప్ కు మద్దతు లభించడంతో 17, 18న బెంగళూరులో జరగునున్న విపక్షాల మీటింగ్ కు ఆప్ హాజవుతుందని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.