Karnataka Lok sabha elections 2024: దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టున్న ప్రాంతం కర్ణాటక. 1990 నుంచి బీజేపీ కర్ణాటకలో మెజారిటీ సీట్లు గెలుస్తోంది. ముంబై మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలో 14 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రజలు వెన్నుదన్నుగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలోని 14 నియోజక వర్గాలను కాషాయం పార్టీ కైవసం చేసుకుంది.
ఈ సారి ఎన్నికల్లో కూడా అదే లక్ష్యంతో అభ్యర్థులను బరిలోకి దింపింది. జేడీఎస్ కు ఒకటి రెండు చోట్ల పట్టున్నా..బీజేపీతో పొత్తు కారణంగా అభ్యర్థులు పోటీలో లేరు. మరో వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ విజయం పునారావృతం చేయాలని పోరాడుతోంది. కన్నడ నాట 1991 కి ముందు వరకూ 1 లేదా 2 స్థానాలను ప్రభావితం చేసిన బీజేపీ..ఆ తర్వాత కాంగ్రెస్, జనతాదల్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది.
బీజేపీ 1991 సాధారణ ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకుంది. ఇందులో 2 స్థానాలు ఉత్తర కర్జాటకలోనివే. 1998 నాటికి రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా బీజేపీ అవతరించింది. అయితే అప్పటి నుంచి కనీసం 10 స్థానాలకు తగ్గకుండా ఉత్తర కర్ణాటకలోని 14 స్థానాల అధిక్యాన్నిసాధిస్తూ వస్తోంది.
దక్షిణ కర్ణాటకతో పోలిస్తే నార్త్ కర్జాటకలో ఎక్కువ మంది సిట్టింగ్ లు టికెట్లు పొందారు. బెళగావి, చిక్కోడి జిల్లాల్లో అభ్యర్థుల కంటే కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య పోరు కొనసాగుతోంది. మరాఠా ఓటర్లు 10 శాతం ఉన్న ఈ స్థానాల్లో రాష్ట్రప్రభుత్వం మరాఠా సంఘాలను నిషేధించడంతో ఈ ఎన్నికలపై తీవ్ర ఫ్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది.
Also Read: ఓటమి భయంతోనే రాయ్ బరేలీ నుంచి రాహుల్ పోటీ: స్మృతి ఇరానీ
ఇటీవల బీజేపీ నేత మరణంతో బెళగావిలో బీజేపీ పట్టు కోల్పోయింది. అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి స్థానికేతరుడు కావడంతో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రి కుమారుడు, చిక్కోడు నుంచి మరో మంత్రి కుమార్తె పోటీ చేస్తుండటంతో అధికార పార్టీ ప్రభావం బలంగా కనిపిస్తోంది. ఇక బల్లారిలో హిందూ ఓట్లు కీలకం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆధిపత్యం సమానంగా ఉంటుంది. మరి కర్ణాటకలో బీజేపీ పూర్వ వైభవం సాధిస్తుందో లేక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అదే ఊపును కొనసాగిస్తుందో అన్నది వేచి చూడాల్సిందే.