Delhi Airport : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతోంది. సమస్యలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ను ఆకస్మికంగా సందర్శించారు. సమస్య తీవ్రంగా ఉన్న మూడో టర్మినల్ లో సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితులను పరిశీలించారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను తనిఖీ చేశారు. విమానాశ్రయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రద్దీని నివారించేందుకు కృషి చేయాలని జ్యోతిరాధిత్య సింధియా నిర్దేశించారు.
సమస్యలేంటి?
ఢిల్లీ విమానాశ్రయంలో కొన్నాళ్లుగా రద్దీ ఎక్కువగా ఉంటోంది. టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో ప్రయాణికులు గంటల తరబడి నిలబడాల్సివస్తోంది. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కడానికి చాలా గంటల సమయం పడుతోంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విస్తరణ పనులు జరుగుతున్నాయి. అందువల్లే సమస్యలు ఎదురయ్యాయి.
ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మూడో టర్మినల్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ రద్దీపై పోస్టులు పెట్టారు. ఆ పోస్టులను కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విమానాశ్రయానికి వచ్చి పరిస్థితులను పరిశీలించారు. అయితే ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు పూర్తైయితే గానీ సమస్య పరిష్కారం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు ప్రయాణికులు ఓపిక పట్టాల్సిందే మరి.