College Bus Accident : తమిళనాడులోని మెట్టుపాళయం సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సు నిండా విద్యార్థులు ఉన్నారు. కానీ వెంటనే బయటకు దిగిపోవడంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు.
నామక్కల్ జిల్లా రాశిపురం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 52 మంది విద్యార్థులు సహా మరో ఐదుగురు సిబ్బంది 6వ తేదీన ఓ ప్రైవేట్ బస్సులో ఊటీకి విహారయాత్రకు వెళ్లారు. ఊటీలోని పర్యాటక ఆకర్షణలు సందర్శనానంతరం నిన్న రాత్రి ఊటీ నుంచి నామక్కల్ కు తిరుగుపయనమయ్యారు.
ఆ సమయంలో కాళ్లారు వంతెన సమీపంలోకి వస్తుండగా బస్సు కుడి వెనుక టైరులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని పట్టించుకోకుండా బస్సు డ్రైవర్ బస్సును నడుపుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి కావడంతో విద్యార్థులు నిద్రపోతున్నారు. ఇంతలో గుర్తించిన డ్రైవర్ బస్సును అక్కడికక్కడే ఆపి ప్రయాణికులందరినీ దింపేశాడు.
ఈ క్రమంలో గాలి వేగంతో బస్సులో చెలరేగిన మంటలు నలుమూలలకు వ్యాపించాయి. స్థానికులతోపాటు మెట్టుపాళయం పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అప్పటికీ బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో 2 గంటలకు పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.ఈ ఘటనపై మెట్టుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.