హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి పెను విధ్వంసం సృష్టిస్తోంది. కొండచరియలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా కులు జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద పెద్ద భవనాలు, ఇళ్లు కుప్పకూలాయి. హిమాచల్ ప్రదేశ్ లో భవనాలు కూలిన దృశ్యాల వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియాను సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ట్విటర్ లో పోస్టు చేశారు. భారీ స్థాయిలో వాణిజ్య సముదాయాలు కూలిపోయాయని తెలిపారు. ఈ ప్రమాదాన్ని స్థానిక యంత్రాంగం ముందే గుర్తించిందని వివరించారు. ప్రజలను ముందే తరలించారని పేర్కొన్నారు.
శిథిలాల కింద చాలామంది బాధితులు చిక్కుకున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని కాపాడేందుకు NDRF బృందాలు రంగంలో దిగాయి. స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టాయి.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కొన్నిరోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతోంది. భారీ వర్షాల కారణంగా కులు-మండీని ప్రాంతాలను కలిపే రోడ్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు స్తంభించాయి. వర్షాల వల్ల ఇప్పటి వరకు రూ.8,014 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. 300 మందికిపైగా మరణించారు.