CM Yogi Adityanath on Gyanvapi Mosque(Telugu news live) : ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. జ్ఞాన్ వాపీ కేసులో చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి. జ్ఞాన్ వాపీ ఇష్యూను ఆయన హిస్టారికల్ బ్లండర్ గా అభివర్ణించారు. అసలు మసీదు అని వ్యవహరిస్తేనే వివాదం అవుతుందని అన్నారు. అక్కడకు త్రిశూలం, జ్యోతిర్లింగాలు ఎలా వచ్చాయని యూపీ సీఎం ప్రశ్నించారు. ఒక వేళ ఈ అంశాన్ని పరిష్కరించాలనుకుంటే ముస్లింవాదులు సరైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు.
సీఎం యోగీ వ్యాఖ్యలను అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ స్వాగతించారు. ఇది ముస్లిం సామాజిక వర్గానికి చక్కని అవకాశంగా అభివర్ణించారు. ముస్లిం పిటిషనర్లు దీనిని ఉపయోగించుకోవాలన్నారు.
మరోవైపు, సీఎం యోగీ వ్యాఖ్యలపై MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. తానొక రాష్ట్రానికి సీఎం అనే విషయాన్ని మరిచి.. యోగీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.
ఇటీవల జ్ఞాన్ వాపీ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. జ్ఞాన్ వాపీ ప్రాంగణంలో ఆర్కియాలాజికల్ సర్వే కు కోర్టు బ్రేకులు వేసింది. వారణాసి కోర్టు ఆదేశాల అమలును అలహాబాద్ హైకోర్టు నిలువరించింది. గతంలో అసలు జ్ఞాన్ వాపీ నిర్మాణం.. మందిరం ఉన్న ప్రదేశంలోనే జరిగిందా? లేదా? తేల్చాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఐతే అలహాబాద్ హైకోర్టు స్టే విధించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.