CM Stalin angry on Modi govt: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తమిళనాడు సీఎం స్టాలిన్. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు బీజేపీ తరపున పోటీ చేస్తున్న అనేకమంది అభ్యర్థులు రౌడీలుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇందుకు సాక్ష్యం తన వద్ద జాబితా ఉందన్నారు. ముఖ్యంగా శాంతిభద్రతల గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదన్నారు. బీజేపీ పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉందన్నారు. ఈ విషయంలో తమిళనాడు ప్రశాంతంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు సీఎం స్టాలిన్.
శనివారం సేలంలో జరిగిన ఎన్నికల సభకు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ పాలనలో జరిగిన అనేక ఘటనలను ప్రస్తావించారు. ఉత్తరాదిలో ఓటమి ఖాయమని భావించిన బీజేపీ.. దక్షిణాదిపై దృష్టి పెట్టిందన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ తరపున పోటీ చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సహా అనేక మంది నేతలు వెనుకాడుతున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ నాటకాలు తమిళనాడులో ఏమాత్రం చెల్లవన్నారు సీఎం స్టాలిన్. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలు నానాకష్టాలు అనుభవించారని ఆరోపించారు. నియంత పాలన సాగిస్తున్న బీజేపీతో నిత్యం కష్టాలే ఎదురవుతాయన్నారు. అందుకే ఆ పార్టీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. తమిళనాడు ఎన్నటికీ పుణ్యభూమిగానే ఉంటుందన్నారు. అన్నాడీఎంకె.. బీజేపీని విమర్శించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. అలాగే బీజేపీ కూటమిలో ఉన్న పీఎంకెపైనా విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం స్టాలిన్.
ALSO READ: విషాదం.. బర్త్ డే కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి
లోక్సభ తొలివిడత ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ సీట్లకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో.. ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. ఆయా సీట్ల నుంచి మొత్తం 950 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తర చెన్నైలో 35 మంది, మధ్య చెన్నైలో 31 మంది, దక్షిణ చెన్నైలో 41 మంది పోటీ పడుతున్నారు.