CM Siddaramaiah MUDA case update(Telugu news live): కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ఓ కుదుపు కుదిపేస్తోంది. దీనిపై సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. ఈ వ్యవహారంపై సోమవారం హైకోర్టు తలుపుతట్టారు సీఎం సిద్ధరామయ్య.
గవర్నర్ థావర్చంద్ ఆదేశాలపై హైకోర్టులో సవాల్ చేశారు సీఎం సిద్ధరామయ్య. దీనిపై విచారణ రేపో మాపో న్యాయస్థానంలో జరగనుంది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ రియాక్ట్ అయ్యింది. సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్సిబల్ సాయంత్రానికి బెంగళూరుకు రానున్నారు. సీఎం సిద్ధరామయ్యను వారు కలవనున్నారు. న్యాయస్థానంలో సీఎం సిద్ధరామయ్య తరపు వాదనలు వినిపించనున్నారు.
సీఎం సిద్ధరామయ్య వైఫ్ పార్వతమ్మకు సంబంధించిన భూములను గతంలో మైసూర్ నగరాభివృద్ధి పనుల కోసం సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూర్-విజయనగరలో భూములను కేటాయించింది. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన భూములను కేటాయించారన్నది బీజేపీ, జేడీఎస్ వాదన.
ALSO READ: విధిరాత ఆ విధంగా, ఢిల్లీలో ఆ యువకుడు మృతి
ఈ క్రమంలో ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని సీఎంకు గవర్నర్ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈనేపథ్యంలో రెండురోజుల కిందట సీఎం విచారణకు అనుమతి మంజూరు చేసింది.
ఇంతవరకు బాగానే ఉంది. కేవలం సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే గవర్నర్ స్పందించారు. ఈ లెక్కన గవర్నర్పై ఎంత ఒత్తిడి వుందోనని అర్థమవుతోందన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. దీని వెనుక ముమ్మాటికీ రాజకీయ కోణం ఉందని బహిరంగంగా చెబుతున్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య సర్కార్ను అప్రతిష్టపాలు చేసేందుకు కమలనాధులు-జేడీఎస్ ఈ ప్లాన్ చేసినట్టు నేతలు చర్చించు కుంటున్నారు.
మూడు నెలల కిందటకు ఒక్కసారి వెళ్దాం. లోక్సభ ఎన్నికల తర్వాత జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కూరుకుపోయారు. ఈ క్రమంలో మాజీ ఎంపీని సిద్ధరామయ్య సర్కార్ చేయడం, ఆయనను జైలుకి పంపించడం చకచకా జరిగిపోయింది. ఈ పరిణామంతో రగిలిపోతున్న జేడీఎస్, ఎలాగైనా సీఎం సిద్ధరామయ్యపై రివేంజ్ తీర్చుకోవాలని స్కెచ్ వేసినట్టు కర్ణాటక కాంగ్రెస్ నేతలు మాట్లాడు కుంటున్నారు.
మైసూర్ ప్రాంతం జేడీఎస్కు కంచుకోట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్కు ఎదురుగాలి వీచింది. ఆ ప్రాంతంలో సీఎం సిద్ధరామయ్యకు మంచి పట్టు ఉంది. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి జేడీఎస్ పన్నిన పన్నాగమని అంటున్నారు. ప్రస్తుతానికి కర్ణాటక రాజకీయాలు సిద్ధరామయ్య వర్సెస్ జేడీఎస్ అన్నచందంగా మారిపోయాయి.