CM Siddaramaiah: తమ భూమిని మైసూరు నగరాభివృద్ధి సంస్థ అక్రమంగా లాక్కుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. తన భార్య పరిహారం పొందేందుకు అర్హురాలని తెలిపారు. విపక్ష నాయకులవి అర్థం లేని ఆరోపణలు అని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
మైసూరులోని కుసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరులు కానుకగా ఇచ్చారు. అనంతరం అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38, 283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని ల్యాండ్తో పోలిస్తే.. విజయనగర్లో భూమికి చాలా ఎక్కువగా మార్కెట్ ధర ఉంటుంది. అయితే అదే బీజేపీ విమర్శలకు కారణం అయింది. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపు కూడా జరిగింది.
బీజేపీ ఆరోపణలపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. తనకు తన రాష్ట్రానికి వ్యతిరేకంగా కమలం పార్టీ కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. తమ భూమిని మూడా అక్రమంగా తీసుకుందని ఆరోపించారు. తన సతీమణి అందుకు అర్హురాలని తెలిపారు. అంతే కాకుండా 2014లో తాను సీఎంగా ఉన్న సమయంలోనే ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. 2021లో మరో దరఖాస్తు చేసుకోగా అప్పటి బీజేపీ సర్కార్ విజయనగరలో భూమి కేటాయించందని వెల్లడించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తే.. దానిని తీసుకుని తన భార్యకు చెందాల్సిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతుండగా.. ఈ స్కాంకు సంబంధించి సీఎం భార్య పార్వతి ఆమె సోదరుడు మల్లికార్జున్, మరో వ్యక్తిపై స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య భార్య పార్వతి, ముగ్గురు అధికారులతో పాటు మైసూరు జిల్లా కలెక్టర్ సహా పలువురు ఇతర ప్రభుత్వాధికారులకు భూకేటాయింపు కుంభకోణంలో పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
Also Read: ఎమర్జెన్సీ అప్రజాస్వామికం కానీ, రాజ్యాంగ విరుద్ధం కాదు
ఈ కుంభ కోణంలో రెవెన్యూ అధికారులు కూడా సహకరించారని తెలిపారు. భూ కేటాయింపు వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కానీ ఈ భూకేటాయింపులు బీజేపీ హయాంలోనే జరిగాయని సిద్దరామయ్య అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది.