Sit-ups: పిల్లలన్నాక స్కూల్లో అల్లరి చేయడం ఎంత సాధారణమో.. చెప్పినమాట వినని పిల్లలకు ఉపాధ్యాయులు పనిష్ మెంట్ ఇవ్వడం అంతే సాధారణం. కానీ.. కొంతమంది టీచర్లు విద్యార్థుల పట్ల మరీ కర్కశంగా వ్యవహరిస్తుంటారు. అలా చాలాసార్లు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒడిశాలో వెలుగుచూసింది. స్కూల్ ఆవరణలో తోటి విద్యార్థులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ గుంజీలు తీయాలని పనిష్ మెంట్ ఇవ్వగా.. గుంజీలు తీస్తూనే ఆ విద్యార్థి మరణించాడు. జాజ్ పూర్ జిల్లా ఒరాలీ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై రసూల్ పూర్ బ్లాక్ బీఈఓ నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జాజ్ పూర్ జిల్లా ఒరాలీ గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో పదేళ్ల రుద్రనారాయణ్ నాల్గవ తరగతి చదువుతున్నాడు. మంగళవారం (నవంబర్ 21) మధ్యాహ్నం 3 గంటల సమయంలో రుద్రనారాయణ పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో.. పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు వారిని చూసి గుంజీలు తీయాలని పనిష్మెంట్ ఇచ్చాడు.
ఐదుగురు విద్యార్థులు గుంజీలు తీయడం ప్రారంభించిన కొద్దిసేపటికే.. రుద్ర కుప్పకూలిపోయాడు. దాంతో రసూల్ పూర్ బ్లాక్ ఓరాలి గ్రామంలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించగా.. అతడిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు.. అక్కడి నుంచి మంగళవారం రాత్రి కటక్ లోని ఎస్ సీబీ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. కానీ.. మార్గమధ్యంలోనే విద్యార్థి మరణించాడని వైద్యులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై తమకు ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని బీఈఓ మిశ్రా వెల్లడించారు.