CJI : సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన జరిగింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే..
న్యాయవాదుల ఛాంబర్ల కోసం కేటాయించిన భూవ్యవహారంపై దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా లిస్ట్ చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. గట్టిగా విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. వికాస్ సింగ్ తీరుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ కు కోపమొచ్చింది. స్వరం పెంచి తనను బెదిరించొద్దు.. ఈ కోర్టు నుంచి బయటకు వెళ్లిపోండి అంటూ వికాస్ సింగ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికాస్ సింగ్ వాదన ఇది..
న్యాయవాదుల ఛాంబర్ల కోసం భూమి కేటాయించడానికి సంబంధించిన అంశాన్ని వికాస్ సింగ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఆ పిటిషన్ విచారణ కోసం తాను 6 నెలలుగా కష్టపడుతున్నానని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీబీఏ వేసిన పిటిషన్ కారణంగానే అప్పూఘర్ భూమి సుప్రీంకోర్టుకు దక్కిందని తెలిపారు. అందులోని కొంత భాగాన్ని మాత్రమే బార్ అసోసియేషన్కు ఇచ్చారని పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆ భూమిలో నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉందన్నారు. తనను ఒక సాధారణ కక్షిదారుడిగానే పరిగణించాలని వికాస్ సింగ్ కోరారు.
సీజేఐ ఆగ్రహానికి కారణమిదే..
వికాస్ సింగ్ అడిగిన తీరుపై సీజేఐ తీవ్రంగా స్పందించారు. కేసును విచారించాలని ఇలా డిమాండ్ చేయకూడదని సీజేఐ అన్నారు. తాము ఖాళీగా కూర్చుంటున్నామని అంటున్నారా? అని ప్రశ్నించారు. కేసు విచారణ చేపట్టేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అలా కుదరకపోతే.. మీ ఇంటికే రావాల్సి ఉంటుందన్న వికాస్ వ్యాఖ్యలతో జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ప్రధాన న్యాయమూర్తిని బెదిరించొద్దని కేసును విచారణకు కోరే పద్ధతి ఇది కాదని హితవు పలికారు. 22 ఏళ్ల సర్వీసులో తాను బెదిరింపులకు లొంగలేదని స్పష్టం చేశారు. చివరి రెండేళ్లలోనూ ఆ పరిస్థితి రానివ్వనని తేల్చిచెప్పారు. బెదిరింపులతో తనను భయపెట్టలేరని.. కోర్టు నుంచి బయటకు వెళ్లాలని వికాస్ సింగ్ ను ఆదేశించారు. ఆ పిటిషన్పై ఈ నెల 17న విచారణ జరుగుతుందని ఇప్పటికే చెప్పామన్నారు. ఎంత ఒత్తిడి చేసినా ఇది తొలి కేసుగా ఉండదని స్పష్టం చేశారు.