CJI DY Chandrachud: ఈ రోజు సుప్రీంకోర్టులో అనూహ్య, అవాంఛనీయ ఘటన జరిగింది. ఓ లాయర్ తరుచూ వాదనల మధ్య దూరడం, డిస్టర్బ్ చేయడంతో సీజేఐ చంద్రచూడ్ సీరియస్ అయ్యారు. అడ్డుపడుతున్న లాయర్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నీట్ యూజీకి సంబంధించిన పిటిషన్లపై వాదనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎంతలా సీరియస్ అయ్యారంటే.. సెక్యూరిటీని పిలవడం.. ఈ లాయర్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లండి అని చెప్పేంతలా కోప్పడ్డారు. అసలేం జరిగింది?
నీట్ యూజికి సంబంధించిన దాఖలైన ఓ పిటిషన్పై సీనియర్ అడ్వకేట్ నరేందర్ హూడా వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో మరో సీనియర్ లాయర్ మాథ్యూస్ నెదుంపర అడ్డు తగిలారు. ‘నేను ఒక విషయం చెప్పాల్సి ఉన్నది’ అంటూ నరేందర్ హూడా వాదనల మధ్యలోకి దూరారు. దీనికి సీజేఐ చంద్రచూడ్ రియాక్ట్ అవుతూ.. హూడా తన వాదనలు పూర్తి చేసే వరకు మాథ్యూస్ ఓపిక పట్టాలని సూచించారు. వెంటనే మాథ్యూస్ కటువుగా స్పందిస్తూ.. ‘ఇక్కడ నేను సీనియర్ మోస్ట్ను’ అని జవాబిచ్చారు. దీంతో సీజేఐకి ఆగ్రహం కలిగింది.
‘నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. గ్యాలరీతో నువ్వు మాట్లాడవద్దు. ఈ కోర్టుకు నేను ఇంచార్జిని. సెక్యూరిటీని పిలవండి.. ఈయనను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి’ అంటూ సీజేఐ ఆగ్రహంతో అన్నారు. తాను బయటికి వెళ్లాల్సి ఉన్నదని, అందుకే ఆ విషయాన్ని చెప్పదలిచానని మాథ్యూస్ వివరించారు. ‘మీరు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెళ్లవచ్చు. న్యాయవ్యవస్థను నేను 24 ఏళ్లుగా చూస్తున్నాను. లాయర్లు ఈ కోర్టు ప్రొసీజిర్స్ను నడపడానికి అనుమతించను’ అని సీజేఐ అన్నారు. దీనికి వెంటనే ‘నేను 1979 నుంచి న్యాయవ్యవస్థను చూస్తున్నాను’ అని మాథ్యూస్ సమాధానమిచ్చారు.
Also Read: అలాగైతే రాష్ట్రానికి లాభం అని ఎలా అంటాం?.. బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ రియాక్షన్
మాథ్యూస్ తన ప్రవర్తనను ఇలాగే కొనసాగిస్తే తాను డైరెక్టివ్ జారీ చేయాల్సి ఉంటుందని సీజేఐ వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా కూడా స్పందిస్తూ.. ఆయన ప్రవర్తన కోర్టు ధిక్కారంగా ఉన్నదని అన్నారు. ఆ తర్వాత మాథ్యూస్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వారేం చేశారో వారికి తెలియదు కాబట్టి.. క్షమిస్తున్నా అంటూ తలబిరుసుగానే మాట్లాడారు.
సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్తో మాథ్యూస్ వాదులటకు దిగడం ఇదే తొలిసారి కాదు. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే వాదనల మధ్యలో దూరారు. ‘మీరేమైనా వాదించదలుచుకుంటే ముందుకు అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాదించాలి. అప్లికేషన్ మెయిల్ చేయండి. ఇది ఈ కోర్టులో రూల్’ అని సీజేఐ పేర్కొన్నారు.
2019లో మాథ్యూస్ నెదుంపర కోర్టు ధిక్కరించారని మూడు నెలల శిక్ష కూడా సుప్రీంకోర్టు విధించింది. కానీ, బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో శిక్ష నుంచి మినహాయించింది. కానీ, మాథ్యూస్ నెదుంపర తన ప్రవర్తన మాత్రం మార్చుకోలేదని తాజా ఉదంతంతో రుజువైంది.