Civil Services Aspirant: సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన అంజలి ఆత్మహత్య చేసుకుంది. ఓ సూసైడ్ నోట్ రాసి మరణించింది. ఆ సూసైడ్ నోట్ చదివితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎదుర్కొంటున్న ప్రెషర్, మెంటల్ టెన్షన్ను అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో బేస్మెంట్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో వరదలు వచ్చి ముగ్గురు సివిల్స్ యాస్పిరెంట్స్ మరణించిన రోజుల వ్యవధిలోనే ఈ ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది.
అంజలి మూడు సార్లు సివిల్స్ అటెంప్ట్ చేసింది. కానీ, ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయింది. ఒక వైపు ఎంత చదివినా ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నాను అనే బాధ ఉంటే మరో వైపు ఆమె ఢిల్లీలో ఉండటానికి అయ్యే ఖర్చు మోపెడు అవుతుండటం కూడా బాధించింది. ఇంటి నుంచి తల్లిదండ్రులు అతి కష్టంగా డబ్బులు పంపిస్తుంటే… తాను ఎంత కష్టపడ్డా పరీక్షలు క్లియర్ చేయలేక నరకం అనుభవించింది. చివరికి ఆ ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్య చేసుకుంది.
Also Read: ఆగస్టులో భాస్కరయోగం ఏర్పడడం వల్ల ఈ 3 రాశుల వారు ధన లాభం పొందబోతున్నారు
‘అయామ్ సారీ మమ్మీ, నాన్న. వీటన్నింటితో నేను అలసిపోయాను.నా ఎదురుగా కేవలం సమస్యలు.. సమస్యలు మాత్రమే ఉన్నాయి. ప్రశాంతత అనేది లేనే లేదు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడటానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేశాను. కానీ, నేను అదిగమించలేకపోయాను’ అని అంజలి సూసైడ్ లెటర్లో రాసింది.
ఆమె ఫ్రెండ్ శ్వేత మాట్లాడుతూ.. ‘అంజలి మూడు సార్లు సివిల్స్ రాసింది. కానీ, ఒక్కసారి కూడా క్లియర్ చేయలేకపోయింది. ఆమె పై ప్రెషర్ పెరుగుతూ వచ్చింది. ఇక రెంట్లు తరుచూ పెరుగుతుండటం, ఇతర ఖర్చులూ తడిసి మోపెడు అవుతుండటంతో ఫైనాన్షియల్గా కూడా ఆమె ఒత్తిడి ఎదుర్కొంది’ అని వివరించింది.
పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి పురికొల్పిన అంశాలేమిటో పరిశీలిస్తామని వివరించారు.