Maoists Encounter In Chhattisgarh: మరోసారి దండకారణ్యం రక్తసిక్తమైంది. తుపాకీ తూటాలతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లాయి. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.
ఛత్తీస్గఢ్లో గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు భీకర పోరు జరిగింది. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, మూడు జిల్లాల ఎస్టీఎఫ్ సంయుక్త బలగాలు నక్సల్స్ వ్యతిరేక సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాయి. దీంతో వారికి మావోయిస్టులు తారసపడగా ఇరువర్గాలు కాల్పులకు దిగడంతో ఏడుగురు మావోలు హతమైనట్లు అధికారులు పేర్కొన్నారు..
కొన్ని మీడియా కథనాల ప్రకారం, నక్సల్ ప్రభావిత నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా దళాలు కొత్త క్యాంపును ప్రారంభించాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో మావోలు కలత చెందారని.. అబుజ్మద్ ప్రాంతంలో అగ్రనేతలు గుమిగూడారని సమాచారం అందుకున్న బలగాలు సోదాలు నిర్వహించాయి.