Chennai Floods: ఓ వైపు వరదలు ముంచెత్తాయి. మరో వైపు అక్కడి ప్రజల దెబ్బకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్లీజ్ మీరు ఆ ఒక్క పని చేయవద్దు అంటూ వేడుకుంటున్నారు అక్కడి అధికారులు. ఈ పరిస్థితి ఎక్కడుందో తెలుసా.. వరదలతో ముంచెత్తిన చెన్నై నగరంలో. ఇంతకు అక్కడి ప్రజలు చేస్తున్న ఆ ఒక్క పనితో.. అధికారులకు ఏ ఇబ్బందులు తలెత్తుతున్నాయో తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా వర్షాలు జోరందుకున్నాయి. ఏపీలో తుఫాన్ ప్రభావం కాస్తంత తక్కువగానే ఉన్నా, తమిళనాడులో మాత్రం వరదల జోరు సాగింది. ప్రధానంగా చెన్నై నగరం వరదలకు వణికిందని చెప్పవచ్చు. ఎటు చూసినా నీటి ప్రళయమే కనిపించింది చెన్నైలో. అందుకే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అక్కడే ఉండి, పరిస్థితులను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. వరుసగా జోరు వానలు కురవగా రహదారులు జలమయమయ్యాయి. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. అంతేకాదు విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలుగగా, విద్యుత్ శాఖ అధికారులు తక్షణం విద్యుత్ క్రమబద్దీకరణ చర్యల్లో నిమగ్నమయ్యారు.
వాతావరణ శాఖ ప్రకటనతో ముందస్తుగా జాగ్రత్తపడ్డ చెన్నై వాసులు ఈసారి తమ వాహనాలను సేఫ్ గానే ఉంచుకున్నారు. అది కూడా చెన్నైలోని పెద్ద పెద్ద వంతెనల మీద కార్లను పార్క్ చేయగా, బైక్స్ ను మాత్రం బెడ్ రూమ్ లలోకి తీసుకెళ్లి భద్రపరచుకున్నారు. ఇంత వరకు ఓకే గానీ.. ఇక్కడి ప్రజలు వరదల సమయంలో చేస్తున్న ఒక్క పని అక్కడి అధికారులకు పెద్ద తలనొప్పిలా మారిందట. ఆ పని ఏమిటంటే.. గృహాలలోని చెత్తను ఇష్టారీతిన పడవేస్తున్నారట. ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, వాటర్ బాటిల్స్ ఇలా విసిరి వేస్తుండగా.. వాటితో పెద్ద సమస్యే ఎదుర్కొంటున్నారు అక్కడి అధికారులు. అసలే వరదల ధాటికి డ్రైనేజి వ్యవస్థ క్రమబద్దీకరించేందుకు అక్కడి అధికారులు, కార్మికులు అష్టకష్టాలు పడుతున్న వేళ.. ప్రజలు మాత్రం వరద నీటిలో, అలాగే గృహాల ముందు భారీగా చెత్త వేస్తుండగా.. ఆ చెత్త వరద నీటి ప్రవాహానికి అడ్డుగా మారిందని కార్మికులు తెలుపుతున్నారు.
వరదల సమయంలో ప్రాణాలు లెక్కచేయక తాము విధులు నిర్వహిస్తుంటే, ప్రజలు ఇలా చేయడం భాదగా ఉందంటున్నారు వారు. ఇప్పటికైనా చెత్తను వీలుంటే దగ్గరలోని చెత్త కుండీలలో గానీ, లేక వరద తగ్గిన సమయంలో గృహాల వద్దకు వచ్చే వాహనాలలో కానీ వేయాలని, ఇష్టారీతిన విసిరివేసి ఇబ్బందులు పెట్టవద్దని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. ప్రజలు ఈ ఒక్క పని చేస్తే చాలు.. సగం పారిశుద్ధ్య చర్యలు పూర్తైనట్లేనని, అలాగే చెత్త పేరుకుపోతే వర్షపునీరు బయటకు వెళ్లదంటూ అధికారులు కూడా సూచిస్తున్నారు. మరి వరదల సమయంలో పని చేస్తున్న అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఇప్పటికే చెత్తను కేవలం చెత్తకుండీలలోనే వేస్తున్నారట.