AGNIVEER: రక్షణ దళంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం పోయిన ఏడాది అగ్నిపథ్ అనే కొత్త స్కీమ్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కీమ్లో భాగంగా మొదటి బ్యాచ్ సైన్యంతో కలిసి సేవలందించేందుకు సిద్ధమైంది. తాజాగా అగ్నివీరుల నియామక ప్రక్రియ విధానంను మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇంతకముందు అగ్నివీరుల నియామకానికి మొదటిదశలో శారీరక సామర్థ్య పరీక్షలు, రెండో దశలో వైద్య పరీక్షలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషణ్(సీఈఈ) నిర్వహించేవారు. ప్రస్తుతం ఈ పద్ధతిలో మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై మొదటి దశలో ఆన్లైన్ సీఈఈ పరీక్ష నిర్వహించి.. ఆ తర్వాత శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. శారీరక సమార్థ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే ర్యాలీలకు అభ్యర్థులు భారీసంఖ్యలో హాజరవుతున్నారని.. రద్దీని నియంత్రిస్తూ నియామక విధానాన్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరిలో జారీ చేయనున్న నియామక ప్రక్రియను కొత్త విధానంలో అమలు చేయనున్నట్లు తెలిపారు.